NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 10:33 pm Posted by : MEDUDHULA KASHAGOUD

జూదంపై పోలీసుల ఉక్కుపాదం ఐదుగురు పట్టివేత..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఎల్లారెడ్డి, జూలై 05:

జూదం నిర్వహిస్తున్న వారిపై ఎల్లారెడ్డి పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21,350 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా జూదం (గేమింగ్) ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ. జూదం కేవలం చట్టవిరుద్ధమైన చర్య మాత్రమే కాకుండా కుటుంబాలు, వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర వ్యసనమని అన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదానికి అలవాటు పడిన వారు చివరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని పేర్కొన్నారు.
యువత తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై వెచ్చించాలని సూచించారు. చట్టవిరుద్ధ మార్గాలు శాశ్వత విజయాన్ని ఇవ్వవని, నిజాయితీ, కృషి, క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఎస్పీ అన్నారు.జూదం, గేమింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని, ఇటువంటి ఘటనలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.