(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 13:
కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో, ఆయన తండ్రి కె.పీ. రాజారెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన కె.పీ. రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డ్యుయల్ డెస్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 35వ వార్డు కాకతీయ నగర్ (దేవునిపల్లి) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వినియోగార్థం 30 డ్యుయల్ డెస్కులను అందజేశారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందించడం తమ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ట్రస్ట్ తరఫున భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బోజన్నగారి వినోద్ రాజు పాటిల్, బండారి నరేందర్ రెడ్డి, రాహుల్ గౌడ్, భాను ప్రకాష్, బీజేపీ నాయకులు నంది వేణు, రాజగోపాల్, చిన్నోళ్ల రజినీకాంత్, భూమేష్ యాదవ్, మహేష్, అశోక్ రెడ్డి, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.