NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:34 pm Posted by : MEDUDHULA KASHAGOUD

ప్రభుత్వ వైద్యుడి సంతకం ఫోర్జరీ సంక్షేమ పథకాల పేరిట మోసానికి యత్నం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 23:

ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్‌ను నకిలీ చేసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన ఘటన కామారెడ్డిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్.ఎం.ఓ.) గా పనిచేస్తున్న డాక్టర్ చందరి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జూలై 22న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో కొన్ని ధృవపత్రాలను పరిశీలించగా వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని, తన అధికారిక సీల్‌ను కూడా అనుమతి లేకుండా దుర్వినియోగం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.ప్రాథమిక విచారణలో ఈ నకిలీ ధృవపత్రాలను కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వినియోగించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ చర్యల వల్ల ప్రభుత్వ రికార్డుల విశ్వసనీయత దెబ్బతినడంతో పాటు సంబంధిత ప్రభుత్వ వైద్యుడి వృత్తిపరమైన ప్రతిష్ఠకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫిర్యాదు ఆధారంగా సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నకిలీ సంతకాలు చేసిన వారు, అధికారిక సీల్‌ను దుర్వినియోగం చేసిన వారు, అలాగే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.