NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 4:07 pm Posted by : MEDUDHULA KASHAGOUD

14వ వార్డులో టీపీసీసీ మార్గదర్శకాలపై అవగాహన కార్యక్రమం

-మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 18:

కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అవగాహన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, సామాజిక బాధ్యత, గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇకపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు వంటి ఆర్భాట కార్యక్రమాలను నిర్వహించకుండా, వాటికి అయ్యే వ్యయాన్ని పేదలు, అవసరమైన వారికి ఉపయోగించేలా టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అలాగే నాయకులకు భారీ పూలమాలలు వేయడానికి జేసీబీలు, బుల్డోజర్లు లేదా ఇతర భారీ యంత్రాలను వినియోగించడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన వనరులను ఆర్భాటాలకు కాకుండా సేవా కార్యక్రమాలకు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు.
నిరాడంబరత, వనరుల సంరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాసేవ వంటి విలువలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆచరణలో చూపించాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ మార్గదర్శకాలను ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె “ఆర్భాటం కాదు… ఆదర్శం మన కాంగ్రెస్ సంస్కృతి”, “వృథా కాదు… సేవే మన లక్ష్యం” అనే నినాదాలను ప్రస్తావిస్తూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాంశెట్టి హర్షిత, తాటి లావణ్య, మాజీ కౌన్సిలర్లు రాణి, పిడుగు మమత, పంపరి లత, నిత్య, సుగుణ, కవిత, గీత తదితరులు పాల్గొన్నారు.