(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి
జూలై 18:
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డ్లో వీధి కుక్కల సమస్యపై స్థానికుల ఫిర్యాదులకు స్పందించిన మున్సిపల్ అధికారులు శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత చొరవతో మున్సిపల్ సిబ్బంది వార్డ్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను పట్టుకున్నారు.కాకతీయ నగర్, సిద్ధి వినాయక నగర్, ఎన్జీవోస్ కాలనీ ప్రాంతాల్లో తిరుగుతున్న కుక్కలను గుర్తించి ప్రత్యేక వాహనాల ద్వారా యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏ.బి.సి.) కేంద్రాలకు తరలించారు. అక్కడ వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు (స్టెరిలైజేషన్) నిర్వహించడంతో పాటు రేబిస్ వ్యాక్సినేషన్ కూడా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.వీధి కుక్కల సంఖ్య పెరగడం వల్ల ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కుక్కల నియంత్రణ కార్యక్రమం మున్సిపల్ పరిధిలో దశలవారీగా కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు పెంపుడు కుక్కల యజమానులకు సూచనలు చేస్తూ, తమ పెంపుడు జంతువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడంతో పాటు గుర్తింపు ట్యాగ్ తప్పనిసరిగా అమర్చాలని కోరారు. ప్రజల భద్రత, జంతు సంక్షేమం రెండింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.