(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 14:
హైదరాబాద్ నుంచి గుజరాత్కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని పిట్లం పోలీసులు పట్టుకున్నారు. 632 పాలిథిన్ కవర్లలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిట్లం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్లతో కలిసి పిట్లం చౌరస్తా సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న జీజే-25-యు-7022 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా, 632 పాలిథిన్ కవర్లలో సుమారు 30 టన్నుల (పిడిఎస్) బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్లు పర్బత్ కరంటా దేవరాజ్ (52), గుజరాత్లోని సూరత్ జిల్లా బర్దోలి నివాసి, శరద్ ఆబా బచ్కర్, మహారాష్ట్రలోని ధూలే జిల్లా నివాసితో పాటు బియ్యం తరలిస్తున్న ఇబ్రహీం, హైదరాబాద్పై కేసు నమోదు చేశారు. ఎస్పీ అభినందనలు అక్రమంగా తరలిస్తున్న (పిడిఎస్) బియ్యాన్ని సమర్థవంతంగా పట్టుకున్న పిట్లం ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్లను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు. అక్రమ రవాణాపై అప్రమత్తంగా వ్యవహరించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసుల పనితీరును ప్రశంసించారు.
ప్రజలకు పంపిణీ చేయాల్సిన (పిడిఎస్) బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.