తిప్పారం గ్రామ పంచాయతీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల
నమస్తే ఇందూర్/గాంధారి, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తిప్పారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రమోద్ మాధవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద్ మాధవరావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పారిశుధ్యం, విద్య, తాగునీరు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.