NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:45 pm Posted by : MEDUDHULA KASHAGOUD

వ్యసన ముక్త భారత్ నిర్మాణమే లక్ష్యం

-భిక్నూర్‌ లో విద్యార్థులకు బ్రహ్మకుమారీస్ అవగాహన కార్యక్రమం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
భిక్నూర్, ఆగస్టు 06:

వ్యసన రహిత సమాజ నిర్మాణమే ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రధాన లక్ష్యమని బ్రహ్మకుమారి సోదరీమణులు పేర్కొన్నారు. గురువారం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో భిక్నూర్ గురుకుల పాఠశాలతో పాటు జడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో “వ్యసన ముక్త భారత్” అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మకుమారి జయదీది, గంగాలత మాట్లాడుతూ నేటి యువత మద్యం, పొగాకు, గుట్కా, మత్తు పదార్థాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉన్నత లక్ష్యాలను సాధించి ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపగలరని తెలిపారు. వ్యసనాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు.విద్యార్థి దశలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడం, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించడం, సత్సంగం, యోగా, ధ్యానం వంటి సానుకూల జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. దేశాభివృద్ధికి యువత కీలక శక్తి కావడంతో ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గురుకుల పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల పాఠశాలల ప్రిన్సిపాల్ రఘునాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన, వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.వ్యసన ముక్త భారత్ నిర్మాణంలో
ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని బ్రహ్మకుమారీస్ నిర్వాహకులు పిలుపునిచ్చారు.