నూతన పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి
నమస్తే ఇందూర్, కామారెడ్డి జిల్లా బీబీపేట్, జూన్ 27:
మండలంలోని నూతన పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2026 జూన్ 15వ తేదీ లోగా నూతన పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు తమ దరఖాస్తులను స్థానిక రైతు వేదికల్లో జూలై 5వ తేదీ లోగా సమర్పించాలని తెలిపారు. రైతు భరోసా పథకం కోసం ప్రత్యేక దరఖాస్తు పత్రాన్ని నింపి, దానికి అవసరమైన పత్రాలను జతచేయాలని సూచించారు.
దరఖాస్తుతో పాటు పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అర్హులైన రైతులందరూ గడువు తేదీ ముగిసేలోపు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ కోరారు.

