(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 26:
ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని కుమ్మరి గల్లి సంఘం ఆధ్వర్యంలో కుర్తి మైసమ్మ దేవి ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో స్వయంగా బోనాలు ఎత్తుకుని డప్పుల వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.అనంతరం కుర్తి మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పొలాల్లో పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.ఈ బోనాల ఉత్సవాల్లో కుమ్మరి సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో కుర్తి మైసమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.


