(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జూలై 22:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చిన “చలో రాజ్భవన్” కార్యక్రమం బుధవారం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాజ్భవన్ ముట్టడికి యత్నించగా, పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీని రాజ్భవన్ సమీపంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులతో రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, రాజ్భవన్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను దిగ్బంధించారు. నిరసనకారులను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, మందుల సామేల్, శంకర్ నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో రాజ్భవన్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారగా, పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అదనపు బలగాలను మోహరించారు. కాంగ్రెస్ నేతల అరెస్టులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


