-జిల్లా సగటు వర్షపాతం 482.7 మి.మీ నమోదు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 01:
కామారెడ్డి, ఆగస్టు 1: తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన మండలాల వారీ వర్షపాతం నివేదిక ప్రకారం కామారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 482.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 397.7 మి.మీతో పోలిస్తే 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
జిల్లాలోని 25 మండలాల్లో ఒక మండలంలో భారీ అధిక వర్షపాతం (లార్జ్ ఎక్స్), 12 మండలాల్లో అధిక వర్షపాతం (ఎక్సెస్), 12 మండలాల్లో సాధారణ వర్షపాతం ( నార్మల్) నమోదైంది. లోటు వర్షపాతం నమోదైన మండలాలు ఏవీ లేవు.భిక్కనూరు మండలంలో అత్యధికంగా 80 శాతం అధిక వర్షపాతం నమోదై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే తాడ్వాయి (42%), బీర్కూర్ (40%), మహమ్మద్నగర్ (39%), సదాశివనగర్ (33%), రాజంపేట్ (32%), నస్రుల్లాబాద్ (29%), జుక్కల్ (29%) మండలాల్లో కూడా సాధారణానికి మించి వర్షాలు కురిశాయి.ఆగస్టు 1న ఒక్కరోజు నమోదైన వర్షపాతం ప్రకారం గాంధారి మండలంలో 22.6 మి.మీ, భిక్కనూరులో 21.5 మి.మీ, డోమకొండలో 15.3 మి.మీ, మాచారెడ్డిలో 13.1 మి.మీ వర్షపాతం నమోదైంది.వ్యవసాయానికి ఈ వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


