(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఆగష్టు 15:
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే ఉద్దేశంతో తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన కమిశెట్టి సంతోష్ హైదరాబాద్కు చెందిన సాంకేత్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ప్రతినిధులు సోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.53 వేల విలువైన ప్రొజెక్టర్, స్క్రీన్ను అందజేశారు. అలాగే గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, విద్యా సామగ్రిని సంస్థ ప్రతినిధులు అందించారు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాంకేత్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మురళి ఫణికుమార్, ప్రెసిడెంట్ మమత, సంస్థ ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ వినోదమ్మ, ఉప సర్పంచ్ కాట్రోత్ రమేష్, గ్రామస్థులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సహకరిస్తున్న సాంకేత్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.


