(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి,
ఆగస్టు 03:
కామారెడ్డి జిల్లా కేంద్రంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. అశోక్ నగర్, పెద్ద బజార్, కొత్త బస్టాండ్ ప్రాంతాలకు చెందిన యాదవ్ సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు తలపై బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, నృత్యాలతో వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అశోక్ నగర్ కాలనీవాసులు యాదవ్ సంఘం నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇటువంటి పండుగలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


