వర్షాలతో దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు
నమస్తే ఇందూర్/ఫరీద్పేట్, ఆగస్టు 8: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కురుమ కొట్టాల రహదారికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతలు, బురద కారణంగా ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహరెడ్డి ప్రత్యేకంగా స్పందించి రహదారి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా రోడ్డుపై మొరం పోయించి గుంతలను పూడ్చి, రహదారిని చదును చేయించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామంలోని రహదారులను దశలవారీగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. రహదారి మరమ్మతులతో కురుమ కొట్టాలకు వెళ్లే ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులకు రాకపోకలు సులభతరం కానున్నాయి.ఈ కార్యక్రమంలో కొంపల్ల పెంటయ్య, మదిరే ఎల్లయ్య, మదిరే నర్సింలు, కొంపల్ల రాజయ్య, అరవింద్, గంగారెడ్డి, కారోబార్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


