-భోజనంలో నాణ్యత లేదని విద్యార్థుల ఫిర్యాదు
-మేనేజ్మెంట్పై చర్యలు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 1:
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలోని శ్రీచైతన్య కార్పొరేట్ హైస్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చదువుతున్న ఎస్టీ బాలబాలికల సమస్యలను జిల్లా అధికారులు మంగళవారం పరిశీలించారు. గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ వినోద్ నాయక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డి.టి.డి.ఓ.)సౌజన్య మేడం పాఠశాలను సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుతున్న గిరిజన విద్యార్థులతో అధికారులు నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపించిందని, అన్నంలో పురుగులు కనిపిస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మూడు పూటలా పప్పుచారు, సాంబార్నే అందిస్తున్నారని తెలిపారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపించిందని తెలుసుకున్న (డి.టి.డి.ఓ.) సౌజన్య మేడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నారు.విద్యార్థుల ఆహారం, చదువు, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు అందుతున్న వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పాఠశాల యాజమాన్యానికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా గిరిజన
విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ వినోద్ నాయక్, మాలోత్ రవి నాయక్ తదితరులు పాల్గొని విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


