(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 04:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం కామారెడ్డి (ఐడీఓసీ) లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల హక్కుల సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్.వై. గిరి పాల్గొన్నారు.అలాగే జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, భూమన్న, శ్రీనివాస్, చింతల శంకర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

