-ఆపదలో ఉన్న పేద కుటుంబానికి షబ్బీర్ అలీ అండ
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20:
ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేద కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరు చేయించి అండగా నిలిచారు.కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరిపేట గ్రామానికి చెందిన రంగు నారగౌడ్ కుమారుడు రంగు లింగగౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో చికిత్స చేయించుకోవడం కష్టంగా మారింది.ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన షబ్బీర్ అలీ నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి లింగగౌడ్కు అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ తరఫున చికిత్స నిమిత్తం రూ.2,50,000 విలువైన ఎల్ఓసీని మంజూరు చేయించారు.ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి లింగగౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు షబ్బీర్ అలీ చేస్తున్న కృషిని స్థానికులు అభినందించారు.


