అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
నమస్తే ఇందూర్ దమ్మపేట జూలై 11
దమ్మపేట:
అంగన్వాడీ టీచర్లు, సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ‘డిమాండ్స్ డే’ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్య హేమసత్యకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అంగన్వాడీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. అయితే, ఐసీడీఎస్ లో పదవీ విరమణ పొందిన టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
ముఖ్య డిమాండ్లు:
కనీస వేతనం: 45వ ఐ.ఎల్.సి సిఫార్సుల మేరకు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ₹18,000 నిర్ణయించి అమలు చేయాలి.
చట్టబద్ధ సౌకర్యాలు: అంగన్వాడీ సిబ్బంది అందరికీ చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి.
బీఎల్ఓ డ్యూటీల రద్దు: అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులను అంటిపెట్టుకుని ఉండే టీచర్లకు బీఎల్ఓ డ్యూటీలు అప్పగించడం దారుణమని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురారి రఘు, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకురాలు సూరమ్మ, జయ, జ్యోతి, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

