నమస్తే ఇందూర్, కామారెడ్డి, ఆగస్టు 4:

భారీ వర్షాల నేపథ్యంలో తాడ్వాయి మండలం ఇస్రోజీవాడి గ్రామాన్ని మంగళవారం ఆర్డీవో, ఎంఆర్ఓ అధికారులు సందర్శించారు. గ్రామ సర్పంచ్ శ్రీ చిందం మల్లేష్తో కలిసి ఇస్రోజీవాడి నుంచి గర్గుల్కు వెళ్లే మార్గంలో వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు.అనంతరం గ్రామంలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇళ్లను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించి, నష్టంపై నివేదిక సిద్ధం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.


