-కలుషిత తాగునీటితో అనారోగ్య భయం
-అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ ఆర్సీ, ఆగస్టు 05:
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి ట్యాంక్ కింద గత కొన్ని సంవత్సరాలుగా మురుగు నీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ పరిసరాల్లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో అదే ప్రాంతం నుంచి సరఫరా అయ్యే తాగునీరు కలుషితమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతూ, ఆ నీటిని తాగడానికి, గృహావసరాలకు వినియోగించడానికి వెనుకంజ వేస్తున్నారు.మురుగు నీటి దుర్వాసనతో పాటు అపరిశుభ్రమైన వాతావరణం నెలకొనడంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల జ్వరం, విరేచనాలు, చర్మవ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి భద్రతపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఈ సమస్యను పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్కు సమాచారం అందించినప్పటికీ, గ్రామసభలో సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. అధికారులు సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.మిషన్ భగీరథ ట్యాంక్ కింద నిల్వ ఉన్న మురుగు నీటిని వెంటనే తొలగించి, ట్యాంక్ పరిసరాలను శుభ్రపరచడంతో పాటు తాగునీటి నాణ్యతను పరీక్షించి శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


