(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 03:
కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు ఎన్జీవోస్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ హర్షిత మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందన్నారు. చిన్నారులు పరిశుభ్రంగా, క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించేందుకు యూనిఫాంలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యా, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణహరి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, స్థానికులు లక్ష్మీనారాయణ, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

