(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 03:
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని రిపుల్స్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థి క్యాబినెట్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఎన్నికలు పాఠశాల ఆవరణలో సందడిగా సాగాయి.విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న విద్యావేత్త అనీల్ కుమార్ పాటిల్ సారథ్యంలో రిపుల్స్ స్కూల్ ప్రతి విద్యా సంవత్సరంలో వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావన, ప్రజాస్వామ్య అవగాహన పెంపొందించేందుకు క్యాబినెట్ ఎన్నికలను నిర్వహించారు.స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్తో పాటు వివిధ కేబినెట్ పదవులకు విద్యార్థులు పోటీ పడ్డారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు తమ లక్ష్యాలు, కార్యాచరణను సహ విద్యార్థులకు వివరించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియను ఎన్నికల మాదిరిగానే నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్యామల తన ఓటును వినియోగించి ఎన్నికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడికి అమూల్యమైనదని, బాధ్యతాయుతంగా ఓటు వినియోగించడం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడవచ్చని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలను అలవర్చుకోవడం అభినందనీయమని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించి ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. రిటర్నింగ్ అధికారిగా రాహుల్, ఇతర ఉపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విద్యార్థుల ఉత్సాహం, క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకుంది.

