(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 03:
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన 63 మంది వాహనదారులకు కోర్టు శిక్షలు విధించింది. జిల్లా పోలీస్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కేసులను విచారించిన న్యాయస్థానం 63 మందిపై శిక్షలు విధించింది. వీరిలో 14 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారిపై కలిపి రూ.70,300 జరిమానా విధించింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ మద్యం సేవించిన తరువాత వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, ఇది కేవలం వాహనదారుడి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే చర్య అని హెచ్చరించారు. క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మద్యం సేవించిన తరువాత వాహనం నడపవద్దని, మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనదని పోలీసులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

