-కమిషనర్, అకౌంటెంట్పై విచారణ కోరిన కౌన్సిలర్లు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 16:
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కొంతమంది అధికారులు కమిషన్లు తీసుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలను ఫిర్యాదులో ప్రస్తావించారు.
1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ కౌన్సిలర్ తాటి లావణ్య ప్రసాద్, 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత సంయుక్తంగా ఈ ఫిర్యాదును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు పంపించారు. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రస్తుత కమిషనర్, అకౌంటెంట్ వ్యవహారశైలిపై అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.ఈ ఫిర్యాదును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎం.ఏ.&యు.డి.) చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ( సి.డి.ఎం.ఏ.), జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)లకు పంపినట్లు తెలిపారు.
శానిటేషన్, వాటర్ వర్క్స్, జనరల్ ఫండ్, 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ల కింద జరిగిన బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత బిల్లుల చెల్లింపులను నిలిపివేయాలని కూడా ఫిర్యాదులో కోరారు.మున్సిపల్ కమిషనర్ పార్వతాలు, అకౌంటెంట్ రాములు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కౌన్సిలర్లు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.
గమనిక: పై ఆరోపణలు కౌన్సిలర్లు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నవే. సంబంధిత అధికారుల విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులు వెల్లడికానున్నాయి.

