(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ జూలై 10:
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ
(ఆర్.ఎస్. ఈ.టి.ఐ.) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మగ్గం వర్క్ ఉచిత శిక్షణ రెండో బ్యాచ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సేటి డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 31 రోజులపాటు కొనసాగే ఈ శిక్షణలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు, ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించి నసురుల్లాబాద్లోని ఆర్సేటి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.శిక్షణ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రంగంలో ముందుకు సాగేందుకు అవసరమైన మార్గదర్శకత్వం కూడా అందించనున్నట్లు తెలిపారు.మరిన్ని వివరాల కోసం 9247540478 నంబర్ను సంప్రదించాలని ఆర్సేటి డైరెక్టర్ అమర్ సింగ్ కోరారు.

